+91

‘నీలో ఉన్నది ఉప్పునీరా? అయితే నీకోసమే బతుకు. కాదూ ఉడుకు రక్తమంటావా? అయితే దేశం కోసం మరణించు.


‘నీలో ఉన్నది ఉప్పునీరా? అయితే నీకోసమే బతుకు. కాదూ ఉడుకు రక్తమంటావా? అయితే దేశం కోసం మరణించు. నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాన్ని సంఘానికి సమర్పించు. నీ గుండెకాయ పత్తికాయ అయితే భరతమాతను మరిచిపోయి నీ సుఖమే చూసుకో’ - ఇలా రోమాలు నిక్కబొడుచుకునేలా పలికిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. కాస్త పొట్టి. దృఢమైన శరీరం. చామనఛాయ. కుడి మోకాలి దగ్గర రివాల్వర్. ముఖమంతా మశూచి గుర్తులు. విశాలమైన నుదురు. మెలి తిరిగిన మీసం. దాన్ని మరింత మెలివేస్తూ ఎడమచేయి. ఇదీ ఆజాద్ రూపం.

‘బతికుండగా నన్ను తెల్లవాళ్లు పట్టుకోలేరు. వాళ్లకంత దమ్ము లేదు’ - ఇదే మాట పదేపదే అనేవాడు చంద్రశేఖర్. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని జాబ్వా జిల్లా భావ్రా గ్రామంలో పుట్టాడు. తండ్రి పండిట్ సీతారాం తివారి. తల్లి జగరాణీదేవి. అంతగా డబ్బున్న కుటుంబం కాదు వారిది.

పిల్లాణ్ని సంస్కృత పండితుణ్ని చేయాలని తల్లి అనుకునేది. కాశీలో చదివించాలని కలలు కనేది. కాని చదువంటే గిట్టేది కాదు చంద్రకి. దాంతో తల్లి కట్టడి చేసేది. అది నచ్చలేదు చంద్రకి. ఇల్లొదిలి ముంబై పారిపోయాడు 13 ఏళ్లప్పుడు. అక్కడ కూలీనాలీ చేశాడు. వేరుశనగకాయలు తిని బతికాడు. మురికివాడల్లో కార్మికుల గదుల్లో తలదాచుకున్నాడు. ఉమ్ములతో, బీడీ పొగలతో, కంపుతో వాంతులొచ్చేలా ఉండేవి ఆ గదులు. రెండేళ్లు అన్నీ భరించాడు. ఇక ముంబైలో ఉండలేకపోయాడు. అలాగని ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఈ కష్టాల కన్నా సంస్కృతం చదువే మంచిదనిపించింది. 1921లో వారణాసి వెళ్లిపోయాడు. సంస్కృత పాఠశాలలో చేరాడు.

సరిగ్గా అప్పుడే గాంధీజీ సహాయనిరాకరణోద్యమంతో దేశం అట్టుడికిపోతోంది. దేశం నలుమూలలా నడుస్తున్న ఆందోళనలు ఆజాద్‌ను వెర్రెక్కించాయి. స్వాతంత్య్రం కోసం ఏదో ఒకటి తానూ చేయాలనుకున్నాడు. అంతే! పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. పెళ్లికెళ్లినంత సంబరం 15 ఏళ్ల చంద్రశేఖర్‌లో!

మెజిస్ట్రేట్ అడిగారు ‘‘నీ పేరేంటి?’’ అని. అసలు పేరు చెప్పలేదు. ‘‘ఆజాద్’’ అన్నాడు. స్వాతంత్య్రమే నా పేరంటూ కాలరెగరేశాడు. ‘‘నీ తండ్రి పేరు?’’ అని అడిగారో లేదో ‘‘స్వేచ్ఛ’’ అన్నాడు కన్నెగరేస్తూ. ఆవేశాన్ని అణుచుకుంటూ మెజిస్ట్రేట్ అడిగారు - ‘‘నీ ఇల్లు’’ అని. టక్కున చెప్పాడు ‘చెరసాల’ అని. ఆయనకు ఒళ్లు మండింది. 15 రోజుల జైలుశిక్ష విధించారు. చిలిపి చంద్ర ఊరుకోలేదు. ‘‘నాకు తెలుసు సర్. నన్ను మా ఇంటికే పంపుతారని’’ అన్నాడు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఖైదు రద్దుచేసి 15 కొరడా దెబ్బల్ని ఖరారు చేశారు.

చర్మం చీలిపోయేలా, ఒళ్లంతా రక్తం కారేలా చితకబాదారు పోలీసులు. ఏడవలేదు ఆ కుర్రాడు. ఒంటిపై పడిన ప్రతి దెబ్బా కర్తవ్యబోధ చేసింది. ‘తాను పుట్టిందే జన్మభూమి రుణం తీర్చుకునేందుకు’ అని అనుకున్నాడు. చంద్రశేఖర్ తివారీ కాస్తా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

రాంప్రసాద్ బిస్మిల్ స్నేహంతో ఆజాద్‌లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. బిస్మిల్, అష్నుకుల్లా ఖాన్, రోషన్‌సింగ్‌లు రైలు దోపిడీకి పన్నిన కుట్రలో పాల్గొన్నాడు. 1924 ఆగస్టు 9న ఈ విప్లవకారులంతా కాకోరి అనే ఊరు వద్ద రైల్ ఆపి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. ఈ కుట్ర కేసులో ముందో వెనకో అందరూ పోలీసులకు చిక్కారు - ఒక్క ఆజాద్ తప్ప. ఆజాద్ మాత్రం రహస్య జీవితంలోకి వెళ్లిపోయాడు.
అజ్ఞాతవాసంలో ఆజాద్ రహస్య కేంద్రం-ఉత్తరప్రదేశ్‌లోని ఓర్చా అరణ్యం. ఇక్కడ సతార్ నది ఒడ్డున ఆంజనేయుడి గుడి పక్క ఓ కుటీరం కట్టాడు. జన్మతః బ్రాహ్మణుడు కాబట్టి, సంస్కృతం వచ్చు కాబట్టి హరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా వేషం మార్చాడు. అన్ని కుట్రలకూ ప్రణాళిక వేసింది ఇక్కడి నుంచే. కాకోరి కేసులో ఆజాద్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

1928 సెప్టెంబర్‌లో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ తదితరులతో కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్’ను స్థాపించాడు ఆజాద్. లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన స్కాట్ అనే పోలీసు అధికారిని చంపాలనుకున్నారు వీరంతా. భగత్, రాజ్‌గురు - స్కాట్‌ని తుపాకీతో కాల్చేలాగ, అందరూ పారిపోయేందుకు ఆజాద్ సహకరించేలా ప్రణాళిక వేశారు. తీరా స్కాట్ అనుకుని సాండర్స్ అనే పోలీసును కాల్చారు. వెంటనే పారిపోయారు భగత్, రాజ్‌గురు. కాని చనన్‌సింగ్ అనే పోలీసు వారిని వెంబడించాడు. ఈ హఠాత్పరిణామానికి ఒక్క క్షణం హతాశుడైపోయాడు ఆజాద్.

ఒక దశలో ఆ ఇద్దరినీ పట్టేసుకోగలిగినంత దగ్గరకొచ్చేశాడు చనన్‌సింగ్. ముగ్గురూ ఒకరిని కాపాడుకుంటూ మరొకరు పరుగోపరుగు. భగత్‌ను చనన్ పట్టుకుంటే, రాజ్‌గురు చనన్‌ను లాగేశాడు. రాజ్‌గురును చనన్ పట్టుకుంటే, భగత్ లాగేశాడు. ముగ్గురూ పెనుగులాడుకున్నారు. ఇలాంటి దశలో చనన్‌ని కాల్చి చంపక తప్పలేదు ఆజాద్‌కి. వెంటనే రివాల్వర్ పేల్చాడు. చనన్ నేలకూలాడు. వాయువేగంతో సాగిపోయే వాహనంలోంచి వెంట్రుకవాసి వస్తువుని సైతం కళ్లుమూసుకుని గురి తప్పకుండా కాల్చగల పట్టు ఆజాద్‌ది.

ఇంకోపక్క ఆజాద్ కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. కాన్పూర్‌లో ఓసారి పోలీసుల కంటపడ్డాడు. రాత్రి 12 గంటలకు శివవర్మతో కలిసి సందులు గొందుల గుండా పరుగు. మూల్‌గంజ్ ప్రాంతంలో ఓ చిన్న గల్లీలోకి వెళ్లేసరికి, ఓ మేడపై నుంచి అందమైన పాట వినిపించింది. అంతే! ఆగిపోయాడు ఆజాద్. ఆ కోకిల స్వరాన్ని వింటూ కూచున్నాడు. ఆమె వేశ్య అని అక్కడి వాతావరణం చెబుతోంది.

వెనక పోలీసులు తరుముతున్నారని తెలుసు. అయినా ఆ నిశ్శబ్ద నిశీధి వాతావరణంలో చీకటిని చీల్చుకుంటూ వెన్నెల జలపాతంలా జారుతున్న ఆమె పాటను వింటూ మంత్రముగ్ధుడైపోయి, ఉన్మత్తుడి విధాన తాదాత్మ్యంలో అలాగే ఉండిపోయాడు. పోలీసులొచ్చేస్తున్నారు మొర్రో అని శివవర్మ చెబుతున్నా వినిపించుకోలేదు. ఆజాద్‌కి సంగీతమన్నా, పాటలన్నా అంత పిచ్చి.

తర్వాత నేరుగా ఝాన్సీకి పారిపోయాడు. తోటి విప్లవకారులతో ఓ ఇంటిలో దాక్కున్నాడు. పోలీసులు ఎలాగైనా ఆజాద్‌ను పట్టుకునేందుకు ఝాన్సీ నగరాన్ని జల్లెడ పట్టడం మొదలెట్టారు. తామంతా కలిసి ఆజాద్‌ను సురక్షిత ప్రాంతానికి దొంగతనంగా తీసుకెళ్లిపోతామన్నారు మిత్రులు. కాని ఆజాద్ ఒప్పుకోలేదు. నా ఒక్కడి కోసం మీరెందుకు బలవ్వాలి అన్నాడు. వారు ఎంత వద్దన్నా వినకుండా అందర్నీ పంపించేశాడు.

ఆ రాత్రికి తానొక్కడే ఆ గదిలో ఉన్నాడు. ఏ క్షణాన్నయినా రక్షకభటులు రావచ్చు. ఇక దొరికిపోయినా ఆశ్చర్యం లేదు. తెల్లారబోతోంది. రాత్రంతా నగరాన్ని గాలించిన పోలీసులు చివరకు ఆజాద్ ఉన్న గదికి వచ్చారు. లోపల ఉన్నాడని వారికి నమ్మకంగా తెలుసు. అందుకే చుట్టూ పహారా కాసి, బలంగా తలుపులు బద్దలుకొట్టి మూకుమ్మడిగా లోపలకు దూసుకొచ్చారు. కాని ఆజాద్ లేడు. వెక్కిరిస్తూ కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి. దటీజ్ ఆజాద్. ఇది జరిగింది 1929 మే 2న.

పార్లమెంటుపై బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. ఎంతగా విచలితుడయ్యాడో ఆజాద్. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న తెల్లారగట్ల జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు.

ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు విప్లవ మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు. అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. ఆజాద్ మెదడు పాదరసంలా పనిచేసింది. కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. క్షణంలో సగం వంతు కాలంలో చుట్టూ పోలీసులు. అంతకన్న వేగంగా కాల్పులు జరిపాడు ఆజాద్. ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు.

ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే, పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. ఛీ! బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్! అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్. నేలకూలాడు.అదీ మహాప్రసాదమే అనుకున్నారు పోలీసులు. భగత్‌సింగ్‌ను ఉరితీయడానికి సరిగ్గా 25 రోజుల ముందే ఆత్మత్యాగం చేశాడు పాతికేళ్ల ఆజాద్. స్వాతంత్య్రం అంటే ఆత్మగౌరవమని నిరూపించాడు.
By- Boddu Mahender

0 comments:

Post a Comment